
మన దేశానికి స్వతంత్రం వచ్చిన ఏడాదే యంగ్ ఎం.ఎఫ్ హుస్సేన్ పెయింటింగ్కి బహుమతి వచ్చింది. అది మొదటి గుర్తింపు. దానికి ముందు రెండు దశాబ్దాలకు పైగానే ఆయన భారతదేశాన్ని చూశాడు. దాని చరిత్రనూ, రామాయణ మహాభారతాలనూ చదివాడు. చిత్రకళా రీతుల్నీ అర్థం చేసుకున్నాడు. స్వతంత్రం కోసం ఉవ్వెత్తున పడి లేస్తున్న ఉద్యమాన్నీ గుండెలకి హత్తుకున్నాడు. చిత్రకారుడిగా గుర్తింపు పొందడానికి ముందు, ఎం.ఎఫ్ హుస్సేన్ అనే ఒక వ్యక్తిత్వం, ఆలోచన, అవగాహన రావడానికి అంతకుముందున్న ఈ అనుభవాలు, ప్రభావాలే దారితీశాయి. ఆయన బొమ్మల్నీ, బతుకునీ చూడ్డానికీ, ఫీలవడానికీ ఇవి ఎంతో పనికొస్తాయి.
ఒకనాడు- గాంధీ నెహ్రూల నాయకత్వంలో దేశమంతా ఒక్కటై బ్రిటిష్ వాళ్లని 'క్విట్' అని నినదించి పొమ్మంటున్నారు. భగత్సింగ్ త్యాగంతో దేశంలో అగ్గి రేగింది. రష్యన్ విప్లవ ప్రభావం అందరిమీదా ఉంది. కమ్యూనిస్టు నాయకుడు పి.సి. జోషి ఇన్స్పిరేషన్తో కవులూ కళాకారులూ 'ఇప్టా' (ప్రజానాట్యమండలి) ప్రారంభించారు. దానికి బలరాజ్ సహానీ, పృధ్వీరాజ్ కపూర్ లాంటి నటులెంతో మంది గొప్ప నాయకత్వమిచ్చారు. బెంగాల్ కరువు కోసం హేమంత్ కుమార్ గొంతెత్తి పాడి, హార్మోనియం వాయిస్తే కలకత్తా వీధుల్లో వేనకువేల జనం వెంట వచ్చి విరాళాలిచ్చారు. హైదరాబాద్లో హుస్సేన్కు బాగా తెలిసిన మఖ్దుం మొహియుద్దీన్ కవిత కట్టలు తెంచుకుంటోంది.
ప్రేమ్చంద్ అధ్యక్షతన ప్రోగ్రెసివ్ రైటర్స్ అసోసియేషన్ మొదలయింది. మనదేశం ఈ నాటికీ గొప్పగా చెప్పుకునే రచయితలూ, కవులంతా ఇందులో చేరారు. వీళ్ల కవితలూ పాటలూ ప్రదర్శనలూ దేశాన్ని ఓ కుదుపు కుదిపాయి.
ఒకనాడు- గాంధీ నెహ్రూల నాయకత్వంలో దేశమంతా ఒక్కటై బ్రిటిష్ వాళ్లని 'క్విట్' అని నినదించి పొమ్మంటున్నారు. భగత్సింగ్ త్యాగంతో దేశంలో అగ్గి రేగింది. రష్యన్ విప్లవ ప్రభావం అందరిమీదా ఉంది. కమ్యూనిస్టు నాయకుడు పి.సి. జోషి ఇన్స్పిరేషన్తో కవులూ కళాకారులూ 'ఇప్టా' (ప్రజానాట్యమండలి) ప్రారంభించారు. దానికి బలరాజ్ సహానీ, పృధ్వీరాజ్ కపూర్ లాంటి నటులెంతో మంది గొప్ప నాయకత్వమిచ్చారు. బెంగాల్ కరువు కోసం హేమంత్ కుమార్ గొంతెత్తి పాడి, హార్మోనియం వాయిస్తే కలకత్తా వీధుల్లో వేనకువేల జనం వెంట వచ్చి విరాళాలిచ్చారు. హైదరాబాద్లో హుస్సేన్కు బాగా తెలిసిన మఖ్దుం మొహియుద్దీన్ కవిత కట్టలు తెంచుకుంటోంది.

ప్రేమ్చంద్ అధ్యక్షతన ప్రోగ్రెసివ్ రైటర్స్ అసోసియేషన్ మొదలయింది. మనదేశం ఈ నాటికీ గొప్పగా చెప్పుకునే రచయితలూ, కవులంతా ఇందులో చేరారు. వీళ్ల కవితలూ పాటలూ ప్రదర్శనలూ దేశాన్ని ఓ కుదుపు కుదిపాయి.
చివరిగా స్వతంత్రం వచ్చిన సంవత్సరంలోనే ప్రోగ్రెసివ్ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఏర్పడింది. దీన్ని ముందుండి నడిపించింది ఫ్రాన్సిస్ న్యూటన్ డిసౌజా (గోవా). మనిషి తెంపరి. మాట దూకుడు. స్టార్ ఎట్రాక్షన్ లాగేస్తుంది. బొమ్మలూ అంతే. హుస్సేన్, రజా ఆయనకంటే చిన్నవాళ్లు. అప్పటి పదిహేడు మంది గ్రూప్ ఫొటో చూస్తే ముచ్చటేస్తుంది. అందరూ చాలా చిన్నవాళ్లు. మొహాల్లో ఎంతో అమాయకత్వం, ఏదో దీక్ష వెలుగుతూంటాయి.
వీళ్లీ సంఘం పెట్టే నాటికి చిత్రకళలో బ్రిటిష్, యూరోపియన్ ఆర్టిస్టుల ప్రభావం రాజ్యమేలుతోంది. తూర్పున 'బెంగాలీ స్కూల్' ఉధృతంగా ఉంది. నందలాల్ బోస్, అయినీంద్రనాథ ఠాగూర్, రవీంద్రుడి చిత్రాల వరసంతా ఒకటి. వైశ్రాయ్లు, తెల్లదొరల పోర్ట్రెయిట్లు, లాండ్స్కేప్లు గీసి పేరూ డబ్బూ గడించిన జామిని రాయ్ అవన్నీ ఒదిలేసి ఊరెళ్లిపోయి ఐదారు చిక్కని రంగులూ పెద్ద గీతలకూ సెటిలయ్యాడు. గ్రెకో రోమన్ ఆర్ట్కి నకలుగా వెలిసిన రాజా రవివర్మ స్టైల్ వెనక్కి తగ్గింది. హంగరీ పంజాబీ తల్లిదండ్రులకు పుట్టిన అమృతా షేర్ గిల్ పారిస్ వెళ్లి ఇంప్రెషనిస్టుల్తో కలిసి తిరిగి బొమ్మలేసినా, ఇండియా తిరిగి వచ్చాక తనదైన భారతీయ శైలిని బొమ్మల్లో చూపింది. మద్రాస్లో రాయ్ చౌధురీ గారిది యూరోపియన్ స్టైలే.



మన ప్రకృతీ, మన పండగలూ రంగులూ, మన కల్చర్ గీసిన గీతల్ని అందుకున్నారు. హుస్సేన్ అయితే మరీ. స్వతంత్ర పోరాట ఘట్టాలెన్నిటినో 'సీరీస్'గా గీశాడు. ఢిల్లీలోని రాజీవ్ సెంటర్లో మూడంతస్థుల పొడుగునా వేలాడదీసిన పెద్ద కేన్వాసుల్ని ఇప్పటికీ మనం చూడొచ్చు. ఆయన గుర్రాలు గానీ అమ్మాయిలు గానీ చెట్టూ పుట్టా రాయీ రప్పా ఏది గీసినా రేఖా చిత్రాల్లాగే ఉంటాయి. ఆయిల్ పెయింటింగ్ అనగానే మనందరికీ మనస్సుల్లో ముందుగా 'ఫిక్స్' అయిన రంగుల మిశ్రమం అందులో కనిపించదు. ముదురు రంగులూ, బండగా బయటి గీతలూ ఉంటాయి. ఇది హుస్సేన్ ముద్ర. ఇలాటివి ఆయన వేలకు వేలు గీశాడు.

70 ఏళ్ల కళాసృష్టిలో ఆయన ఫలానా థీమ్ మాత్రమే గీశాడని చెప్పలేం. గుర్రాలు గీసిన కాలం. మానవ శరీరాకృతుల్ని గీసిన కాలం. గాంధి, నెహ్రూ, ఇందిరాగాంధి, మదర్ థెరిసా వంటి ప్రముఖుల్ని గీసిన కాలం. హైదరాబాద్లో బద్రి విశాల్ పిట్టి ఇంట్లో ఉండే కాలంలో చెక్కబొమ్మల్ని చెక్కిన కాలం. ప్లాస్టర్ ఆఫ్ పారిస్తో బొమ్మలు రూపొందించిన కాలం. ఇలా ఒక దాన్నించి ఒకటి మారుతూ వెళ్లాడు. సమకాలీన రాజకీయాలపై కూడా అనేకం వేశాడు. అందులో అవినీతిపై వేసింది కూడా ఉంది.
అన్నిటినీ అందరూ చూడ్డం అసాధ్యం. కానీ సాధ్యమైనన్ని చూడడం, ఫీలవడం తర్వాత తరాలకివ్వడం మనం చేయాలి. ఆ రంగులు గీతల ధ్యాసలో పడి ధ్యానంలోకెళ్లి కాన్వాసులో కలవాలి తప్ప ఫ్రేము కింద దాని రేటునే చూసి అదే పనిగా అబ్బురపడిపోడం ఆపాలి.
గ్రేటెస్ట్ ఎవరో?

డిసౌజా అంటే మాటలు కాదు. బోల్డన్ని మాటలు కూడా. హుస్సేన్ లాంటి వాళ్లకంటే చాలా ముందువాడు. ప్రపంచంలో పేరున్న ఆర్టిస్టు. మన గోవా బిడ్డడు. ఎవ్వర్నీ లెక్కచేసే బాపతు కాదు. అనుకుంటే ఎంత మాటైనా అనేస్తాడు. ఎంత గొప్ప ఆర్టిస్టో అంత లోతైన విమర్శకుడు.

ఆర్.కె. లక్ష్మణ్ వేసే కాకుల మీద మీ అభిప్రాయం అనడిగితే అవి ఇండియన్ ఆర్ట్కి దిష్టిబొమ్మలన్నాడు. ఇంకా ఇలాంటి వైల్డ్ కామెంట్స్ అయింతర్వాత: "ఈ భూ పెపంచకంలో ఇప్పుడున్న గ్రేటెస్ట్ ఆర్టిస్ట్ ఎవరనుకుంటున్నారు?'' అనడిగితే తడుముకోకుండా "ఇప్పుడెలాగూ పికాసో చచ్చిపోయాడు గనక ప్రపంచంలోకెల్లా గొప్ప ఆర్టిస్టుని నేనే'' అన్నాడు.
తర్వాత కొంతకాలానికి న్యూయార్క్లో డిసౌజా చనిపోయాడు. అప్పట్నుంచి హుస్సేన్ సాబే గ్రేటెస్ట్ అని మేము ఫిక్సయిపోయాం.
అప్పుడేమో-మరే


అలా ఒకరోజు ఫోటో చూసి "గురూ హుస్సేన్ కమ్స్ టు టౌన్'' అని అందరికీ ఊదాను. వెళ్దామా అన్నారు. వెళ్దాం అనుకున్నాం. మాలాగే పలువురు ముక్కూ మొహం లేని చిత్రకారులందరికీ ఫోన్లు కొట్టాం. బిలబిలమంటూ అంతా పోగై 'సినిమా ఘర్'కి వెళ్లాం. ఓ ఇరవై మంది ఉంటామేమో. ఆ భవంతి పూర్తిగా కట్టడానికింకో రెండేళ్లు పట్టేట్టుంది. ఒట్టి సిమెంట్ స్కెలిటన్ ఉంది. లేని, కట్టని గేట్ దగ్గర వాచ్మన్ కోసం చూస్తుంటే హుస్సేన్ అంత పొడుగూ, అలాటి తెల్లజుట్టూ గల విగ్రహం కనిపించింది. "సార్ రావడానికో అరగంట పట్టొచ్చు వెయిట్ చేయండి'' అన్నాడు ఆయన.

ఆయన హుస్సేన్ సాబ్ పెద్దకొడుకు. రోడ్డుకవతల చెట్టుకింద టీ బండి వాడి దగ్గర కూచున్నాం. మా రైటరూ, క్రిటిక్కూ అయిన శివాజీ, ఆర్టిస్టులు రాజు, బ్రహ్మం, ఆంజనేయులు, అక్బర్, శంకర్, అన్వర్, శ్రీరామ్ ఇంకా చాలామందిమున్నాం. ఈలోగా కవయిత్రి శైలజ వచ్చేసింది. ఇంకా జనం చేరారు. అదిగో రానే వచ్చాడాయన. పొలోమంటూ పోయాం. ఆయన వాచీ వంక చూసుకుని "యు సీ ఐ హేవ్ నో టైమ్ టు టాక్ టు సచె క్రౌడ్. ఐ హేవ్ గాట్ సమ్ అర్జంట్ బిజినెస్ టు అటెండ్'' అంటే ఎలా? డైలమా. "పిల్ల కాకులు మీతో నాకేంటి బే'' అంటే అప్పుడెలా? ఏమో. తీరా పలకరిస్తే ఏ గుడ్డూ లేదు. నాతో రండన్నాడు. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్లేముందు సినిమాఘర్లో ఏమేం చేద్దామనుకుంటున్నాడో చెప్పాడు. ఇక్కడ లైబ్రరీ, అక్కడ థియేటర్. పైన స్టుడియో, వర్క్షాప్ల హాల్. మీరంతా రెగ్యులర్గా రండి. ఇక్కడే బొమ్మలేసుకోండి. సినిమాలు చూడండి. సెమినార్లు పెట్టుకోండి. మన ఆర్ట్ గురించి చర్చించండి. నిజానికిది మీదే. ఎప్పుడూ నేనుండాలనేం లేదు. మీకు మీరే ఏదొకటనుకుని అది ఇక్కడే చేసుకోండి అని చెప్పుకుపోతున్నాడు.



అంధేరీ గదిలో చిత్తప్రసాద్తో చిన్న గదిలో ఉండి బ్లాక్ టీలే తిండిగా బతికిన కాలం గురించి అడిగితే చిత్తప్రసాద్ డ్రాయింగ్స్, పప్పెట్స్ గురించి చాలా చెప్పాడు. ఆయన బొమ్మని ఆయన స్టైల్లోనే గీసిన నా డ్రాయింగ్ మీద సంతకం పెడుతూ "నన్ను రవీంద్రనా«థ్ ఠాగూర్ని చేశావుగా'' అన్నాడు. మరి "మీరు అదే గదా'' అంటే పువ్వులా నవ్వాడు. మా ఆర్టిస్టులంతా అప్పటికప్పుడు గీసిన కేరికేచర్ల మీద అదేపనిగా ఆటోగ్రాఫ్లిస్తున్నాడు. "ఒరేయ్ నా సంతకం రేటు కోటిరా. నేను కింగునిరా మీ ముష్టి బొమ్మల మీద సంతకం చేసే ముదనష్టం వాళ్ళా కనిపిస్తున్నాన్రా'' అనడం లేదు.

పదండి పైకెళ్దాం అన్నాడు. సెకండ్, థర్డ్ ఫ్లోర్లకు మెట్లమీద చెంగు చెంగున ఎగిరి దూకుతున్నాడు. వెనక మా చిల్లర గుంపు. ఒక్కో మెట్టుమీద ఆయన కాలు పడుతుంటే వెనక ఆయన పైజమా పైకి లేచి కాలి పిక్కలు పసుప్పచ్చగా బలంగా కనిపించాయి. మాకు ఆయాసాలొచ్చాయి గానీ ఆయన దర్జాగా వెళ్తున్నాడు. పైన మూడో ఫ్లోర్లో మన చిరంజీవి, బాలకృష్ణలకు వేసే హోర్డింగ్లంతటి కేన్వాసులు. ఫ్రేముల్లేనివి. అవి హుస్సేన్కంటే రెండింతలు పొడుగున్నాయి. అంత బరువు మోయడం మాలాటి వాళ్ళకి జరిగే పనికాదు. ఆయన మాత్రం చులాగ్గా ఎత్తేసి దాన్ని పేద్ద హాలంతా రోల్ చేసి, ఆ బొమ్మలన్నిటి వివరాలూ చెప్తున్నాడు. మీ ఇంట్లో చిన్న పిల్లలు రెండుకొండలూ, సూర్యుడూ, చెట్టూ, ఇల్లూ వేసి ఎలా చెప్తారో అచ్చం అట్లాగే. అంతకుముందు రోజే ఆయన బొమ్మలు మొదలెట్టినట్టూ, అది మాకు పిల్లాడిలా చూపిస్తున్నట్టూ ఉంది. ఇంత అమాయక వెర్రిబాలుడితో వేగటమెట్లాగా అనిపించింది. ఈతడి స్వీప్ అసాధ్యమనీ అనిపించింది.

ఆయనన్నాడు : "ఈ ఫీల్డ్లోకి చాలామంది ఫాన్సీతో వస్తారు. నిజానికి దారి తప్పి వస్తారు. అందులో తొంభై శాతం, గట్టిగా చెప్పాలంటే తొంభై తొమ్మిది శాతం ఆర్టిస్టులు కారు. ఎవరో ఒకరిద్దరో ఇంకా కొద్దిమందో ఆర్టిస్టులు కాగలుగుతారు. మిగతా వాళ్లంతా ఆర్టిస్టులు కారు'' అన్నాడు. వీళ్లంతా "రనాఫ్ ది మిల్'' అని చెప్పాడు.
గుండె గుభిల్లంది. మేం దారి తప్పిన గొర్రెలమా? రనాఫ్ ది మిల్ గాళ్ళమా? మమ్మల్ని రక్షించే ఏసుక్రీస్తు ఏడోసారి పునరుత్థానము చెందునా. తెల్వది.
పనికిమాలిన పక్కచూపు


మాధురీ దీక్షిత్తో మరొకళ్లో గొప్ప నటీమణులు కావచ్చు. నిజం కూడా. చాందినీబార్ సినిమాలో టబు అద్భుతమైన నటన చూసినపుడు ఇంత గొప్ప ఆర్టిస్టుని మన సినిమాల్లో బొడ్డు చూపి నడుం ఊగించే ఆడ మాంసంగా చూపిస్తారేమని బాధ ముంచుకొచ్చేస్తుంది. హుస్సేన్ కళ గురించి తలచుకోవాల్సిన టైమ్లో ఆ పని మానేసి టబును తలచుకోడమంటే ఆవిడ గొప్ప కళకి జరిగిన అన్యాయాన్నే మనం హుస్సేన్కి చేస్తున్నామని లెక్క. చాలామంది కళాకారులకి ఈ అన్యాయం జరిగింది. పికాసో పెయింటింగ్లూ, శిల్పులూ, రాతలూ చూడ్డం, మాట్లాడితే వినడం మానేసి ఆయన పన్నెండు మంది పెళ్లాల్ని మార్చాడని చెప్పుకున్నాం. అలాంటి హాలీవుడ్ సినిమాలనే చూశాం. విన్సెంట్ వాంగో చెవికోసుకున్నాడనీ, చెయ్యి కాల్చుకున్నాడనీ మాట్లాడుకోడం తప్ప అతని పెన్సిల్ డ్రాయింగ్లు, పెయింటింగ్లు చూడ్డానికి టైమెక్కడిది. మహా అయితే మొన్నే యూరప్లో 'సన్ఫ్లవర్స్' ఇన్ని కోట్లకు వేలంలో పోయిందట. ఇది రికార్డు రేటంట అని చెప్పుకుంటాం.

"ఐ ఫూల్డ్ ఒన్ హండ్రెడ్ మిలియనీర్స్'' అని పికాసో ఎప్పుడో చెప్పిన విషయాన్ని మేం తలచుకున్న మర్నాడే శివసేన బాల్థాకరే ఆ కొటేషన్ని జర్నలిస్టులకు గుర్తు చేశాడు. ఏమో హుస్సేన్ కూడా అలా చేశాడేమో మనకేం తెలుసు. మనం 'ఆర్ట్' అనే దాన్ని వదిలేసి అడ్డమైన వాటిని పట్టుకు వేళ్ళాడ్డం ఇకనైనా మానెయ్యాలి. పనికి మాలిన పక్కచూపుల వల్ల అసలు సంగతి ఆవిరై పోతుంది.
................................................
* మోహన్
77028 41384